రాజకీయ దురుద్దేశంతోనే ఎస్ఎల్బీసీని పక్కన పెట్టారు
మన భారత్, నాగర్ కర్నూల్: తెలంగాణలో సాగునీటి రంగాన్ని పునర్నిర్మించే సామర్థ్యం ఉన్న ఎస్ఎల్బీసీ (సాగర్ లెఫ్ట్ బ్యాంక్ కనాల్) ప్రాజెక్టు రాజకీయ దురుద్దేశంతోనే నిలిచిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాగర్కర్నూల్ జిల్లాలో ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాంతంలో నిర్వహించిన జియోఫిజికల్ సర్వే అనంతరం మన్నెవారిపల్లిలో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
“కమిషన్ రాకుండా ఉండటమే కారణం!”
గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టిందని రేవంత్ ఆరోపించారు. “కేసీఆర్–హరీశ్రావులకు ఈ ప్రాజెక్టులో కమీషన్లు రావని తెలుసు. అందుకే ప్రజలకు మేలు చేసే ఈ ప్రాజెక్టును గాలికొట్టేశారు. పదేళ్ల పాలనలో 10 కిలోమీటర్ల టన్నెల్ కూడా పూర్తి చేయలేదు,” అని మండిపడ్డారు.
“ఏ ప్రాజెక్టునూ పూర్తి చేయలేదు కేసీఆర్”
పదేళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాటా పెరిగి తెలంగాణకు నష్టం కలిగిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ నిర్వాకం వల్లే ఏపీ ప్రభుత్వానికి దారులు తెరుచుకున్నాయని చెప్పారు. “కేసీఆర్కు నిజమైన చిత్తశుద్ధి ఉంటే ఎస్ఎల్బీసీ పనులు ఎప్పుడో పూర్తయ్యేవి,” అని అన్నారు.
ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు చరిత్ర
1983లో ఈ ప్రాజెక్టు ఆమోదం పొందగా, 30 టీఎంసీల నీటిని తరలించి 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో రూపొందించబడింది. 2004లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి టన్నెల్ పనులు ప్రారంభించారు. దేశంలోనే తొలిసారిగా టన్నెల్ బోరింగ్ మెషిన్ ఉపయోగించి రూ.1968 కోట్లతో పనులు మొదలయ్యాయి. 2014 వరకు ఒక కిలోమీటరు టన్నెల్ పూర్తయింది.
ప్రపంచ రికార్డు సాధించే అవకాశం
“ప్రపంచంలో 40 కిలోమీటర్ల టన్నెల్ ఎక్కడా లేదు. ఎస్ఎల్బీసీ పూర్తి అయితే ఆ రికార్డు తెలంగాణదే అవుతుంది,” అని ముఖ్యమంత్రి అన్నారు. ప్రస్తుతం రూ.4600 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు కొనసాగుతోందని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.1.5 లక్షల కోట్లు వెచ్చించిన కేసీఆర్, కృష్ణా నదిపై ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేదని విమర్శించారు.
ముంపు గ్రామాలకు భరోసా
మర్లపాడు, కేశ్యతండా, నక్కలగండి తండా గ్రామాల సమస్యలను డిసెంబర్ 31 లోగా పరిష్కరిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. ప్రాజెక్టు పనుల్లో మృతి చెందిన 8 మంది కార్మికుల కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. “ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తాం. ఇది నల్గొండ, మహబూబ్నగర్ భవిష్యత్తు కోసం తప్పనిసరి,” అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
