మన భారత్, నాగర్ కర్నూల్:
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ Centre of Indian Trade Unions (సీఐటీయూ) నాగర్ కర్నూల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో లేబర్ కోడ్ల ప్రతులను దహనం చేసి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా జరిగిన నిరసన కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి పొదిల రామయ్య మాట్లాడుతూ కార్మిక వర్గం ఎన్నో సంవత్సరాల పోరాటాలతో సాధించుకున్న హక్కులను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లు నిర్వీర్యం చేస్తున్నాయని ఆరోపించారు. కార్మికులకు రక్షణ కల్పించే 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రస్తుత లేబర్ కోడ్లు కార్మిక వర్గానికి ఉరిశిక్షలుగా మారాయని, కనీస వేతనాల చట్టాలను బలహీనపరిచే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. రోజువారీ కనీస వేతనాలను తక్కువ స్థాయిలో నిర్ణయించడం ద్వారా కార్మికుల శ్రమను కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా మార్చుతున్నారని ఆరోపించారు.
అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ దిశగా నడిపిస్తూ ప్రజా రంగాన్ని బలహీనపరుస్తోందని ఆయన అన్నారు. విద్యుత్ సవరణ బిల్లులు, కార్మిక చట్టాల మార్పులు, వ్యవసాయ రంగానికి సంబంధించిన విధానాలు కార్మికులు, వ్యవసాయ కూలీల హక్కులను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొన్నారు.
కార్మిక వర్గం సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. పోరాడి సాధించుకున్న హక్కులను రక్షించుకునేందుకు కార్మికులు ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు లక్ష్మయ్య, ఆంజనేయులు, నిరంజన్, మురళి, ముర్తుజా, శివ తదితరులు పాల్గొన్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
