మన భారత్, నాగర్ కర్నూలు:
నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం అల్లిపూర్ గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుంచి నిప్పు రవ్వలు పడి మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమై రైతు తీవ్ర నష్టాన్ని చవిచూశాడు. బాధితుడు డొక్కా శ్రీనివాస్కు చెందిన సుమారు 2.10 గుంటల భూమిలో సాగు చేసిన పంట అగ్నికి ఆహుతైంది.
స్థానికుల వివరాల ప్రకారం, ట్రాన్స్ఫార్మర్లో సాంకేతిక లోపం కారణంగా నిప్పు రవ్వలు పడి పంటలో మంటలు చెలరేగాయి. సమాచారం అందేసరికే మంటలు వేగంగా వ్యాపించి మొత్తం పంటను కాల్చివేశాయి. చేతికి అందే సమయంలోనే పంట నాశనం కావడంతో రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ఈ ఘటనలో సుమారు రూ.2 లక్షలకుపైగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అప్పుల్లో ఉన్న రైతుకు ఇది మరింత భారంగా మారింది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
బాధిత రైతును ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని, సరైన పరిహారం అందించాలని రైతు సంఘాలు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యుత్ శాఖ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
