మన భారత్, నాగర్ కర్నూల్:
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్ కార్మికులకు కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ ఆసుపత్రి ఏడి సంపత్ కుమార్, అనంతరాములు గారికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, హాస్పిటల్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి పొదిల రామయ్య మాట్లాడుతూ, జిల్లా జనరల్ ఆసుపత్రిలో 60 పడకల నుంచి 330 పడకల వరకు విస్తరించిన ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులు కనీస వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కుటుంబ పోషణ కూడా కష్టసాధ్యంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వరకు కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాయని విమర్శించారు. కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేస్తామని హామీ ఇచ్చినా అమలు చేయకపోవడం వల్ల కార్మికుల హక్కులు దెబ్బతిన్నాయని అన్నారు. సమాన పనికి సమాన వేతనం వంటి చట్టాలు అమలు చేయకుండా తక్కువ వేతనాలతో పని చేయించుకుంటున్నారని ఆరోపించారు.
అలాగే కార్మికులకు ఇవ్వాల్సిన ఈఎస్ఐ, పిఎఫ్ వంటి సౌకర్యాలు కూడా సరైన విధంగా అమలు కావడం లేదని, కాంట్రాక్టర్లు దోపిడీకి పాల్పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కనీస వేతనం రూ.26,000 అమలు చేయడంతో పాటు అన్ని సంక్షేమ సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో ప్రధాన డిమాండ్ల సాధన కోసం ఈ నెల 23న డీఎంఈ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, జిల్లాలోని కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ కార్మికులు బాలకృష్ణమ్మ, రంజాన్ బీ, రాధారాణి, మణెమ్మ, కృష్ణమ్మ, అజ్మీర పుష్ప, మల్లేశ్వరి, బాలమణి, లక్ష్మమ్మ, మైబు, శ్యామల, ఈశ్వరమ్మ, లలిత, లక్ష్మి, కృష్ణవేణి, అనిత, రామచంద్రమ్మ, జాంగిర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
