మన భారత్ , తలమడుగు:
తలమడుగు మండలం సకినాపూర్ గ్రామంలో ఘనంగా నిర్వహించిన శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం సోమవారం విజయవంతంగా ముగిసింది. మూడు రోజుల పాటు వైభవంగా సాగిన ఈ ఆధ్యాత్మిక వేడుకలు గ్రామంలో భక్తి భావాన్ని నింపాయి.

విగ్రహ ప్రతిష్ఠాపనను పురస్కరించుకుని గ్రామంలో 21 రోజులపాటు ప్రత్యేక నియమ నిష్ఠలతో హనుమాన్ దీక్షలు నిర్వహించారు. ఈ కాలంలో గ్రామస్తులు మద్యం, మాంసాహారం త్యజించి, పాదరక్షలు ధరించకుండా సంప్రదాయాలను కచ్చితంగా పాటించారు. గ్రామానికి బయటి నుంచి వచ్చే వారికి కూడా ఇదే నియమాలు వర్తింపజేస్తూ, గ్రామ పొలిమేర వద్ద ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేశారు.

చివరి రోజు హోమాలు, పూర్ణాహుతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించగా, అనంతరం మహా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరై భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. మొత్తం గ్రామం పండగ వాతావరణాన్ని సంతరించుకుంది.

ఈ వేడుకల్లో గ్రామ సర్పంచ్ నిఖిత నగేష్తో పాటు గ్రామ పెద్దలు, యువత, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా పూర్తవడంతో గ్రామంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.

