ఇల్లందు పోలీసులు నిందితుడు సపావత్ వెంకన్నపై పీడీ యాక్ట్ నమోదు
మన భారత్, భద్రాద్రి కొత్తగూడెం :జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. నిషేధిత గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న సపావత్ వెంకన్న అనే వ్యక్తిపై ఇల్లందు పోలీసులు పీడీ యాక్ట్ (Preventive Detention Act) అమలు చేశారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు, ఇల్లందు డీఎస్పీ చంద్రభాను మార్గదర్శకత్వంలో ఇల్లందు సీఐ సురేష్ ఆధ్వర్యంలో ఈ చర్య చేపట్టారు. కేసముద్రం మండలం, మహబూబాబాద్ జిల్లాకు చెందిన వెంకన్న ఇల్లందు, భద్రాచలం, అలాగే హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో గంజాయి రవాణా కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇల్లందు పోలీసులు సేకరించిన ఆధారాలతో ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించగా, వారి ఆదేశాల ప్రకారం పీడీ యాక్ట్ కింద ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఖమ్మం సబ్ జైలులో ఉన్న నిందితుడు వెంకన్నను చర్లపల్లి జైలుకు తరలించి, అక్కడి అధికారుల సమక్షంలో పీడీ యాక్ట్ ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ, “గంజాయి వ్యాపారం వలన అనేక మంది యువత మత్తుకు బానిసలవుతున్నారు. వారి భవిష్యత్తు నాశనం కాకుండా ఉండేందుకు ఇలాంటి నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటున్నాము” అని తెలిపారు. జిల్లా పోలీస్ శాఖ తరపున ‘చైతన్యం – డ్రగ్స్పై యుద్ధం’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఎస్పీ వెల్లడించారు. అక్రమ రవాణాను అరికట్టడమే కాకుండా ప్రజల్లో అవగాహన పెంచేందుకు గ్రామ స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. నిందితుడు సపావత్ వెంకన్నపై పీడీ యాక్ట్ అమలులో కీలక పాత్ర పోషించిన ఇల్లందు డీఎస్పీ చంద్రభాను, సీఐ సురేష్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ప్రజలు కూడా ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలను గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు.
