మన భారత్, హనుమకొండ:
హనుమకొండ పట్టణంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా కీలక ముందడుగు పడింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో అశోక థియేటర్ సమీపంలో రూ.15 కోట్ల అంచనా వ్యయంతో మల్టీ పర్పస్ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పెయి, కుడా చైర్మన్ ఇనగల వెంకట్రామి రెడ్డి, ఎమ్మెల్యే నాగరాజు తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, హనుమకొండలో పెరుగుతున్న వాహన రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆధునిక పార్కింగ్ సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ద్వారా నగరంలో పార్కింగ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.
అదేవిధంగా వరంగల్ పట్టణ ప్రాంతాన్ని హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాలు, తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, శానిటేషన్, ఆరోగ్య రంగాల్లో విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
హైదరాబాద్ తర్వాత జంట నగరాలుగా అభివృద్ధి చెందుతున్న వరంగల్-హనుమకొండ-కాజీపేట ప్రాంతాలను సమగ్ర ప్రణాళికతో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
స్థానిక ప్రజలు ఈ ప్రాజెక్ట్పై హర్షం వ్యక్తం చేస్తూ, నగర ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
