మన భారత్, విజయనగరం :
విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కెరటాం గ్రామంలో రూ.96 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు మరియు డ్రైనేజీ కాలువలను రాష్ట్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం ప్రారంభించారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి ఈ పనులు కీలకంగా మారనున్నాయి.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని పేర్కొన్నారు. కెరటాం గ్రామంలో రూ.96 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులు గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రతి పల్లెకు అభివృద్ధి ఫలాలు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు.
గ్రామస్తులు మంత్రికి ఘన స్వాగతం పలికి, గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో గ్రామంలో పరిశుభ్రత, రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలు, మండల అధికారులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
