మన భారత్, టెక్నాలజీ డెస్క్:
దేశంలో ప్రతి పౌరుడికి కీలక గుర్తింపు పత్రంగా ఉన్న ఆధార్ కార్డు, వ్యక్తి మరణించిన తర్వాత కూడా యాక్టివ్గా ఉండటం వల్ల దుర్వినియోగానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో మరణించిన వ్యక్తుల ఆధార్ను డీయాక్టివేట్ చేయడం అత్యంత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
Unique Identification Authority of India (UIDAI) దీనికి సంబంధించి ప్రత్యేక సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. కుటుంబ సభ్యులు లేదా సంబంధిత వ్యక్తులు సులభంగా ఆన్లైన్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.
ముందుగా అధికారిక MyAadhaar పోర్టల్లోకి వెళ్లి, తమ ఆధార్ నెంబర్ లేదా కుటుంబ సభ్యులలో ఎవరిదైనా ఆధార్ నెంబర్తో లాగిన్ కావాలి. ఓటీపీ ద్వారా ధృవీకరణ పూర్తయ్యాక “Report Death of a Family Member” అనే ఆప్షన్ను ఎంపిక చేయాలి.
తదుపరి దశలో మరణించిన వ్యక్తి ఆధార్ వివరాలను నమోదు చేసి, డెత్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. అనంతరం మున్సిపాలిటీ లేదా సంబంధిత అధికారులచే జారీ చేసిన మరణ ధృవీకరణ పత్రాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఈ ప్రక్రియ పూర్తయ్యాక, UIDAI అధికారులు వివరాలను పరిశీలించి ధృవీకరిస్తారు. అన్ని వివరాలు సరైనట్లుగా ఉంటే, సంబంధిత వ్యక్తి ఆధార్ను శాశ్వతంగా డీయాక్టివేట్ చేస్తారు.
ఈ సేవ ద్వారా మోసాలను నివారించడమే కాకుండా, మరణించిన వ్యక్తి వివరాలను సక్రమంగా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే కుటుంబ సభ్యులు ఈ ప్రక్రియను నిర్లక్ష్యం చేయకుండా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
