మన భారత్ ,సిద్దిపేట:
తెలంగాణ అసెంబ్లీలో జరిగిన చర్చల సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ శివుడి కుటుంబానికి సంబంధించిన చిత్రపటాన్ని ప్రదర్శించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. రవాణా, బీసీ సంక్షేమ శాఖల కేటాయింపులపై చర్చ జరుగుతున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

సభలో మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ శివపార్వతుల కుటుంబ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ చర్యపై ప్రతిపక్ష సభ్యులు వెంటనే అభ్యంతరం వ్యక్తం చేశారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం సభలో ఎలాంటి చిత్రాలు, ప్రకార్డులు లేదా గుర్తులు ప్రదర్శించరాదని వారు గుర్తుచేశారు.

అయితే మంత్రి స్పందిస్తూ, తాను ముందుగా అనుమతి తీసుకున్నానని తెలిపారు. ఇటీవల వేములవాడకు విచ్చేసిన శృంగేరి పీఠాధిపతి చెప్పిన సందేశాన్ని గుర్తుచేసుకుంటూ, విభేదాలు ఉన్నప్పటికీ కుటుంబంలా కలిసి ఉండాల్సిన అవసరాన్ని శివుడి కుటుంబ చిత్రంతో వివరించానని చెప్పారు.

ఈ సంఘటనతో సభలో కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. అసెంబ్లీ నిబంధనల అమలు, సభ్యుల ప్రవర్తనపై మళ్లీ చర్చ మొదలైంది.
సభలో ఇలాంటి చర్యలు సరైనవా కాదా అన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని కొందరు సభ్యులు అభిప్రాయపడుతున్నారు.

