మన భారత్, ఆదిలాబాద్
ప్రజలకు నాణ్యమైన పోలీసింగ్ అందించడమే లక్ష్యం..
నేర నియంత్రణలో సాంకేతికతకు ప్రాధాన్యం ఇవ్వాలి: బాసర జోన్ డీఐజీ ఆర్. భాస్కరన్ ఐపీఎస్
ఆదిలాబాద్, జూలై 11 (మన భారత్): ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించడం ప్రతి పోలీసు అధికారి ప్రధాన బాధ్యత అని బాసర జోన్ డీఐజీ ఆర్. భాస్కరన్ ఐపీఎస్ పేర్కొన్నారు. సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేసి నేరాలను ముందుగానే గుర్తించి అరికట్టే విధంగా పోలీసులు పనిచేయాలని ఆయన సూచించారు.
శనివారం ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన డీఐజీ ఆర్. భాస్కరన్ ఐపీఎస్, జిల్లా పోలీసు ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) హెడ్క్వార్టర్స్లో పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాకు తొలిసారిగా విచ్చేసిన డీఐజీకి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ పూలమొక్క అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పోలీసు సాయుధ దళం అందించిన గౌరవ వందనాన్ని స్వీకరించిన డీఐజీ, డీఎస్పీలు, సీఐలు, ఎస్హెచ్ఓలతో జిల్లా శాంతిభద్రతలు, నేర నియంత్రణ చర్యలు, పోలీసింగ్ విధానాలపై విస్తృతంగా సమీక్ష నిర్వహించారు.
సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ జిల్లాలో అమలవుతున్న ప్రత్యేక పోలీసింగ్ చర్యలు, నేర నియంత్రణ వ్యూహాలు, బందోబస్తు నిర్వహణ, పోలీస్ స్టేషన్ల పనితీరు, ప్రత్యేక డ్రైవ్లు, గతంలో నమోదైన కీలక కేసుల దర్యాప్తు తదితర అంశాలపై సమగ్ర నివేదికను డీఐజీకి వివరించారు.
ఈ సందర్భంగా డీఐజీ ఆర్. భాస్కరన్ మాట్లాడుతూ జిల్లాలో పోలీసుల పనితీరు ప్రశంసనీయంగా ఉందని పేర్కొన్నారు. ఇదే క్రమశిక్షణ, సేవాభావంతో ముందుకు సాగాలని సూచించారు. ప్రతి ఎస్హెచ్ఓ తన పోలీస్ స్టేషన్ పరిధిలో సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకుని నేరాలను ముందుగానే గుర్తించి సమర్థవంతంగా అరికట్టే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
బేసిక్, విజిబుల్, ప్రో-యాక్టివ్ పోలీసింగ్పై దృష్టి
ప్రతి పోలీసు అధికారి బేసిక్ పోలీసింగ్తో పాటు విజిబుల్ పోలీసింగ్ను సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించాలని డీఐజీ సూచించారు. అలాగే ప్రో-యాక్టివ్ పోలీసింగ్ ద్వారా సమస్యలు ఉత్పన్నం కాకముందే నివారణ చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ వారి సమస్యలను సత్వరమే పరిష్కరించేలా పనిచేయాలని సూచించారు.
సోషల్ మీడియాపై నిరంతర నిఘా అవసరం
సోషల్ మీడియాలో విద్వేషపూరిత ప్రచారం, తప్పుడు సమాచారం, రెచ్చగొట్టే పోస్టులు, మత విద్వేషాలను రెచ్చగొట్టే సందేశాలపై నిరంతర నిఘా కొనసాగించాలని డీఐజీ ఆదేశించారు. అలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చిన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుని శాంతిభద్రతలకు ఎలాంటి భంగం కలగకుండా చూడాలని స్పష్టం చేశారు.
సరిహద్దు జిల్లాపై ప్రత్యేక పర్యవేక్షణ
ఆదిలాబాద్ జిల్లా అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో గంజాయి, మాదకద్రవ్యాలు, అక్రమ రవాణా, ఇతర నేర కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కేసుల దర్యాప్తును శాస్త్రీయంగా నిర్వహించి నిందితులకు కోర్టుల్లో శిక్షలు పడేలా పటిష్టమైన సాక్ష్యాధారాలు సమర్పించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
పోలీస్ స్టేషన్లలో 5ఎస్ విధానం అమలు చేయాలి
ప్రతి పోలీస్ స్టేషన్లో 5ఎస్ విధానాన్ని అమలు చేస్తూ పరిశుభ్రత, క్రమశిక్షణ, పారదర్శకతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని డీఐజీ పేర్కొన్నారు. ప్రతి ఎస్హెచ్ఓ నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుని తన పరిధిలో నేర నియంత్రణలో ప్రత్యేక గుర్తింపు సాధించేలా పనిచేయాలని సూచించారు.
సమావేశం అనంతరం పోలీస్ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో డీఐజీ ఆర్. భాస్కరన్ ఐపీఎస్, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ కలిసి మొక్క నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటిచెప్పారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన) పి. మౌనిక ఐపీఎస్, ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే ఐపీఎస్, డీఎస్పీలు ఎల్. జీవన్ రెడ్డి, ఎం. వెంకట నరసయ్య, కమతం ఇంద్రవర్ధన్, పోలీస్ కార్యాలయ ఏవో శివకుమార్, సూపరింటెండెంట్లు సులోచన, సంజీవ్, సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, డీసీఆర్బీ, ఐటీ కోర్, కమ్యూనికేషన్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.
మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
