మూడేళ్లుగా నిలిచిపోయిన పనులు..
ప్రజల ఇబ్బందులు పట్టించుకోవడం లేదని ఎమ్మార్పీఎస్ నేత ఆవేదన
తక్షణమే నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఎలుకటి రాజయ్య మాదిగ డిమాండ్
మన భారత్ | భూపాలపల్లి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నైన్పాక గ్రామం – భూపాలపల్లి మండలం నేరేడుపల్లి గ్రామాల మధ్య మోరంచ వాగుపై నిర్మిస్తున్న వంతెన పనులు మూడేళ్లుగా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షుడు ఎలుకటి రాజయ్య మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన అర్ధాంతరంగా నిలిచిపోయిన బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2022 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం సుమారు రూ.6 కోట్ల వ్యయంతో మోరంచ వాగుపై వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని గుర్తు చేశారు. అయితే పనులు ప్రారంభమైన కొంతకాలానికే నిలిచిపోవడంతో ఇప్పటికీ పూర్తి కాకపోవడం పాలకులు, అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.
ఈ వంతెన పూర్తయితే నైన్పాక, నేరేడుపల్లి, పరిసర గ్రామాల ప్రజలకు భూపాలపల్లి జిల్లా కేంద్రానికి రాకపోకలు సులభతరం అవుతాయని, విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు ఎంతో ప్రయోజనం పొందేవారని అన్నారు. అయితే నిర్మాణం నిలిచిపోవడంతో ప్రజల ఆశలు అడియాసలయ్యాయని పేర్కొన్నారు.
ప్రస్తుతం వంతెన లేకపోవడం వల్ల గ్రామాల ప్రజలు భూపాలపల్లి చేరుకోవడానికి అదనంగా సుమారు 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోందని చెప్పారు. వర్షాకాలంలో మోరంచ వాగు ఉద్ధృతంగా ప్రవహించే సమయంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. దీంతో అత్యవసర వైద్య సేవలు, విద్య, ఉపాధి అవకాశాల కోసం వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేపట్టిన అభివృద్ధి పనులు మధ్యలోనే ఆగిపోవడం వల్ల ప్రభుత్వ నిధులు వృథా కావడంతో పాటు ప్రజల నమ్మకం కూడా దెబ్బతింటోందని ఆయన అన్నారు. ఇప్పటికే నిర్మించిన భాగాలు కూడా కాలక్రమేణా దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఇకనైనా స్థానిక ఎమ్మెల్యే, జిల్లా అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మాణానికి ఉన్న అడ్డంకులను తొలగించి పనులను వెంటనే పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు. పనులు వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
ప్రజల ప్రయోజనాలకు సంబంధించిన అభివృద్ధి పనులను రాజకీయాలకు అతీతంగా పూర్తి చేయాలని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఎలుకటి రాజయ్య మాదిగ విజ్ఞప్తి చేశారు. నైన్పాక – నేరేడుపల్లి వంతెన నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కల నెరవేరుతుందని పేర్కొన్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
