మన భారత్, తలమడుగు:
1995లో ప్రభుత్వం కేటాయించిన భూములకు చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు
తలమడుగు: మండల పరిధిలోని కజ్జర్ల శివారులో ప్రభుత్వం ఎస్సీ కుటుంబాలకు కేటాయించిన సాగు భూములకు వెళ్లేందుకు సరైన దారి లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ బాధిత రైతులు తలమడుగు తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు.
రైతులు తెలిపిన వివరాల ప్రకారం, 1995లో ప్రభుత్వం కజ్జర్ల శివారులోని సాగు భూములను కజ్జర్ల గ్రామానికి చెందిన 12 ఎస్సీ కుటుంబాలకు, రుయ్యాడి గ్రామానికి చెందిన 21 ఎస్సీ కుటుంబాలకు కేటాయించింది. అప్పటి నుంచి రైతులు తమ పొలాలకు చేరుకునేందుకు సమీపంలోని ఇతర భూముల గుండా వెళ్లి వ్యవసాయ పనులు నిర్వహించేవారు.
అయితే కాలక్రమేణా ఆ భూములు ఇతరుల యాజమాన్యంలోకి వెళ్లడంతో ప్రస్తుతం తమ భూముల గుండా వెళ్లేందుకు అనుమతించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది నుంచి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి పరిష్కారం లభించలేదని తెలిపారు.
దీంతో ప్రభుత్వం కేటాయించిన భూములకు చేరుకోవడం కష్టసాధ్యంగా మారిందని రైతులు వాపోయారు. దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూములకు రాకపోకల దారి లేకపోవడంతో వ్యవసాయ కార్యకలాపాలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలను పొలాలకు తరలించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.
ప్రభుత్వం తమకు కేటాయించిన సాగు భూములకు శాశ్వత రహదారి ఏర్పాటు చేసి, అధికారిక దారిపత్రం మంజూరు చేయాలని రైతులు తహసీల్దార్ను కోరారు. సమస్యను వెంటనే పరిశీలించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ అంశంపై రెవెన్యూ అధికారులు స్పందించి, క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి బాధిత ఎస్సీ రైతులకు న్యాయం చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
ఈ కార్యక్రమంలో జువ్వక భూమక్క, పట్ల అనసూయ, ఆకు నారాయణ, సారా లలిత, అగ్గిమల్ల భాగీరథి, రామెల్లి దయాకర్, రామెల్లి ప్రభాకర్, అగ్గిమల్ల శివమ్మ, మల్లమ్మ, ఉడుగు ఏడేళ్లు, గుమ్మకూర కైలాష్, వాంకేడి శశికళ తదితర రైతులు పాల్గొన్నారు.
గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
