మన భారత్, హైదరాబాద్:
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకున్న పవన్ కల్యాణ్ ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు జూబ్లీహిల్స్లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
ప్రధాని మోదీ ప్రత్యేకంగా పవన్ కల్యాణ్ ఇంటికి చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య కొద్దిసేపు ఆత్మీయంగా చర్చ జరిగినట్లు సమాచారం.
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన అనంతరం ఆయన పవన్ నివాసానికి వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఇక ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ప్రత్యేక పోస్టు చేశారు. తెలంగాణకు వచ్చిన ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలుకుతూ ఆయన సందేశం విడుదల చేశారు.
తెలంగాణలో రూ.9,400 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడం పట్ల ప్రధాని మోదీకి పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి, రవాణా అనుసంధానం, యువతకు కొత్త అవకాశాల కల్పనలో కేంద్ర ప్రభుత్వం చూపుతున్న నిబద్ధత అభినందనీయమని పేర్కొన్నారు.
తెలంగాణ అభివృద్ధిపై ప్రధాని మోదీ నిరంతరం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన పార్టీ తరఫున ప్రధానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్ భేటీతో పాటు అభివృద్ధి ప్రాజెక్టులపై వచ్చిన ప్రకటనలు ప్రస్తుతం రాజకీయ, సామాజిక వర్గాల్లో విస్తృత చర్చకు దారితీశాయి.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
