మన భారత్, శృంగవరపుకోట:
శృంగవరపుకోట నియోజకవర్గంలోని ఎస్.కోట మండలం ఆలుగుబిల్లి గ్రామ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. గ్రామం నుంచి జాగరపు వారి కల్లాల వరకు నెలకొన్న చీకటి సమస్యకు పరిష్కారం చూపుతూ ఏర్పాటు చేసిన నూతన విద్యుత్ స్తంభాలు, వీధి దీపాలను ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్తో కలిసి ప్రారంభించారు.
గ్రామస్తులు చాలా కాలంగా ఈ మార్గంలో విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరుతూ వస్తుండగా, ప్రజల సమస్యను గుర్తించిన ప్రజాప్రతినిధులు వెంటనే చర్యలు తీసుకున్నారు. సుమారు రూ.3 లక్షల పంచాయతీ నిధులతో ఈ అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. మొత్తం 20 ఎలక్ట్రికల్ స్తంభాలను ఏర్పాటు చేసి, వీధి దీపాలను అమర్చడం ద్వారా రాత్రి వేళల్లో గ్రామ ప్రజలకు సౌకర్యం కలిగేలా చర్యలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో పొలాలకు వెళ్లే రైతులు, గ్రామానికి రాకపోకలు సాగించే ప్రజలు చీకటి కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పుడు విద్యుత్ దీపాల ఏర్పాటు వల్ల భద్రతతో పాటు సౌకర్యం కూడా పెరుగుతుందని పేర్కొన్నారు.
ప్రజల కనీస అవసరాలను తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని ప్రతి మారుమూల గ్రామానికి రోడ్లు, విద్యుత్, తాగునీరు వంటి మౌలిక వసతులు అందించే వరకు విశ్రాంతి తీసుకోబోమని తెలిపారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన ప్రతి పనిని దశల వారీగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
గ్రామస్తులు మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న సమస్యకు పరిష్కారం లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. వెంటనే స్పందించి విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. రాత్రి వేళల్లో చీకటి సమస్య తొలగిపోవడంతో గ్రామ ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
