రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగుల పునరావాస కేంద్రాలకు ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీ
దివ్యాంగుల విద్య, ఉపాధి, స్వయం ఉపాధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత: దివ్య దేవరాజన్
మన భారత్, హైదరాబాద్:
రాష్ట్రంలోని దివ్యాంగుల అభివృద్ధి, పునరావాసం లక్ష్యంగా ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా దివ్యాంగుల పునరావాస కేంద్రాలకు ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీ కార్యక్రమం హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు.
రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దివ్యాంగుల అవగాహన, శిక్షణ, ఉపాధి, విద్య, వైద్యం, పునరావాస అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి సంస్థ కార్యదర్శి దివ్య దేవరాజన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
రాష్ట్రంలోని అన్ని మండలాలకు చెందిన దివ్యాంగులు, ఐకేపీ సిబ్బంది, అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి సంస్థ కార్యదర్శి దివ్య దేవరాజన్ మాట్లాడుతూ దివ్యాంగులు విద్య, ఉద్యోగం, జీవనోపాధి రంగాల్లో ముందుకు సాగేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని తెలిపారు. గ్రామస్థాయిలో అధికారులు క్షేత్ర పర్యటనలు నిర్వహించి దివ్యాంగుల సమస్యలను గుర్తించాలని సూచించారు.
దివ్యాంగుల కోసం స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడే సమస్యలు పూర్తిగా తెలుస్తాయని పేర్కొన్నారు. దివ్యాంగుల సంఘాలను బలోపేతం చేయడంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అలాగే పునరావాస కేంద్రాల్లో 3 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల లోపు వయస్సు గల దివ్యాంగ బాలికలకు ఉచిత విద్య, వైద్యం, పౌష్టికాహారం అందిస్తున్నట్లు తెలిపారు. ఆయా కేంద్రాల్లో వారికి అవసరమైన శిక్షణ, సంరక్షణ కల్పిస్తున్నట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో తలమడుగు మండల ఏపీఎం చంద్రశేఖర్, సుజాత, జిల్లా అధికారులు, వివిధ శాఖల సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన దివ్యాంగుల పునరావాస కేంద్రాలకు కేటాయించిన ఎలక్ట్రిక్ ఆటోలను అధికారులు, ప్రజా ప్రతినిధులు పంపిణీ చేశారు. ఈ వాహనాలు దివ్యాంగుల సేవలు, పునరావాస కార్యక్రమాలకు మరింత ఉపయోగపడనున్నాయి.
