మన భారత్, విజయనగరం :
విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోని సిరిపురం గ్రామంలో శ్రీ కంచమ్మ తల్లి తొలేళ్ల ఉత్సవం సందర్భంగా ఆదివారం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారి నివాసంలో ఉన్న అమ్మవారి మూలవిరాట్, ఘటాలను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉత్సవ ఏర్పాట్లపై ఎంపీ వివరాలు తెలుసుకున్నారు. సోమవారం నిర్వహించనున్న పాలధార కార్యక్రమం, రథాల ఊరేగింపుకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు. రథాల ఊరేగింపు జరిగే ప్రధాన రహదారిని స్వయంగా పరిశీలించి అధికారులకు, నిర్వాహకులకు సూచనలు చేశారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఎంపీ ఆదేశించారు. తాగునీరు, భద్రత, పారిశుధ్యం, రవాణా వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఉత్సవాలను శాంతియుతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు స్థానిక ప్రజలు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
గ్రామంలో జరుగుతున్న ఈ ఉత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పడంతో పాటు, ప్రాంతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయని ఎంపీ పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
