మన భారత్, విజయనగరం :
విజయనగరం జిల్లా గంట్యాడ మండల కేంద్రంలోని శాఖ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని శాఖ గ్రంథాలయ అధికారి కే. శ్రీనివాస్ సూచించారు. ఆదివారం గ్రంథాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, విద్యార్థుల్లో పుస్తక పఠనం అలవాటు పెంపొందించడానికి, మేధో సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి ఈ శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. వేసవి సెలవులను సృజనాత్మకంగా వినియోగించుకోవడానికి ఇవి మంచి వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు.
శిబిరాల ద్వారా విద్యార్థులకు చిత్రలేఖనం, చెస్, సాధారణ జ్ఞానం వంటి అంశాల్లో శిక్షణ అందిస్తున్నామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమాల ద్వారా పిల్లలలో సృజనాత్మకత పెంపొందడంతో పాటు, ఆలోచనా విధానం మెరుగుపడుతుందని తెలిపారు.
విద్యార్థుల నైపుణ్యాన్ని గుర్తించి, వారి ప్రతిభను మరింత మెరుగుపరచడమే ఈ వేసవి విజ్ఞాన శిబిరాల ముఖ్య ఉద్దేశమని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఈ శిబిరాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పనిసరిగా ఈ శిబిరాలకు పంపించి, వారి భవిష్యత్తు అభివృద్ధికి తోడ్పడాలని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
