మన భారత్, మంచిర్యాల జిల్లా:
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. చందారం గ్రామానికి చెందిన మాధవి (17) అనే ఇంటర్మీడియట్ విద్యార్థిని పరీక్షల్లో ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురై శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడింది.
స్థానికుల వివరాల ప్రకారం, మాధవి చిన్నతనంలోనే తల్లిదండ్రులు సుధాకర్, కవితలను కోల్పోయింది. అప్పటి నుంచి ఆమె అక్క అనిత సంరక్షణలో పెరిగింది. చదువులో ఎదురైన ఓటమిని తట్టుకోలేక క్షణికావేశంలో ఈ దారుణ నిర్ణయం తీసుకోవడం గ్రామంలో విషాదాన్ని నింపింది.
ఈ ఘటనలో మరింత కలచివేసిన అంశం ఏమిటంటే, మాధవి మృతదేహానికి ఆమె అక్క అనిత స్వయంగా అంత్యక్రియలు నిర్వహించడం. చెల్లిని కోల్పోయిన బాధతో ఆమె బోరున విలపించడం అక్కడున్న ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది.
ఈ సంఘటన గ్రామస్థులను తీవ్రంగా కలచివేసింది. చదువులో అపజయం ఎదురైనా జీవితం ముందుంది అనే విషయాన్ని విద్యార్థులు గుర్తించాలనీ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు మానసికంగా అండగా నిలవాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
