మన భారత్, విజయనగరం :
విజయనగరం జిల్లా గుర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం పోలీసులు విస్తృత స్థాయిలో నఖాబంది (వాహన తనిఖీలు) నిర్వహించారు. ముఖ్య జంక్షన్ల వద్ద ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీలు చేపట్టినట్లు ఎస్సై నారాయణ రావు తెలిపారు.
ఈ సందర్భంగా వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు, ఇన్సూరెన్స్ తదితర వివరాలను పరిశీలించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి హెచ్చరికలు జారీ చేయడంతో పాటు, నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పోలీసులు పేర్కొన్నారు.
ప్రత్యేకంగా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడం ఎంత ముఖ్యమో వివరించారు. హెల్మెట్ వాడకం వల్ల ప్రమాదాల సమయంలో ప్రాణాపాయం తగ్గుతుందని తెలియజేశారు. అలాగే మద్యం సేవించి వాహనం నడపకూడదని, వేగ నియంత్రణ పాటించాలని సూచించారు.
మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని శక్తి యాప్ నమోదు మరియు వినియోగంపై కూడా అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ యాప్ ద్వారా వెంటనే పోలీసులకు సమాచారం అందించవచ్చని వివరించారు. మహిళలు, యువత ఈ యాప్ను తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు.
ఇలాంటి నఖాబంది కార్యక్రమాలు రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని, ప్రజల సహకారం అవసరమని పోలీసులు తెలిపారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
