మన భారత్, తెలంగాణ:
రాష్ట్ర ఆర్టీసీ కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకుని గుడ్న్యూస్ చెప్పారు. ఇటీవల తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు నిర్వహించిన సమ్మె కాలానికి వేతనాలు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది.
మూడు రోజుల సమ్మె కాలానికి సంబంధించిన పూర్తి వేతనాన్ని చెల్లించడంతో పాటు, ఆందోళన సమయంలో కార్మికులపై నమోదైన కేసులను కూడా ఎత్తివేయడానికి సీఎం ఆమోదం తెలిపారు. కార్మిక సంఘాల ప్రతినిధుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఈ నేపథ్యంలో వెంటనే చర్యలు చేపట్టాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు సంబంధిత అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ముందుకు వస్తోందని అధికారులు పేర్కొన్నారు.
ఈ నిర్ణయంతో ఆర్టీసీ కార్మికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం గుర్తించడం పట్ల కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. భవిష్యత్తులో కూడా కార్మిక సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి
