మన భారత్, తెలంగాణ:
సైబర్ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులు సైతం మోసగాళ్ల బారిన పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది.
వివరాల ప్రకారం, “వికసిత్ భారత్” పథకం పేరుతో ఒక వ్యక్తి ఎమ్మెల్యేను సంప్రదించి అర్హుల జాబితా పంపిస్తే ప్రతి ఒక్కరికీ రూ.10 లక్షల రుణాలు మంజూరు చేస్తామని నమ్మబలికాడు. ఈ ప్రక్రియలో ప్రాసెసింగ్ ఫీజుగా ఒక్కొక్కరికి రూ.2,500 చొప్పున మొత్తంగా రూ.1 లక్ష చెల్లించాలని చెప్పాడు.
నమ్మిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫోన్పే ద్వారా ఆ మొత్తాన్ని పంపించారు. అనంతరం మళ్లీ డబ్బులు కోరడంతో అనుమానం వచ్చిన ఎమ్మెల్యే విషయం తెలుసుకునే ప్రయత్నం చేయగా మోసం జరిగినట్టు గుర్తించారు.
దీంతో వెంటనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ విభాగం సాంకేతిక ఆధారాలతో విచారణ కొనసాగిస్తోంది.
ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ పథకాల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలను నమ్మేముందు సంబంధిత అధికారులతో ధృవీకరించుకోవాలని సూచించారు. డబ్బులు అడిగే అపరిచితులపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లావాదేవీలను వెంటనే పోలీసులకు తెలియజేయాలని తెలిపారు.
