విబి–జీ రామ్ జీ అమలుతో గ్రామీణ ఉపాధికి ముప్పు: ఎంజిఎన్ఆర్ఇజిఎస్కు తీవ్ర ప్రతికూలతలు
మన భారత్, తెలంగాణ:
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విబి–జీ రామ్ జీ (VB–G RAMG) విధానం గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్ఆర్ఇజిఎస్) స్ఫూర్తికి విరుద్ధంగా మారుతోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గ్రామసభ ఆమోదాలు, ఉపాధి కోసం వచ్చిన డిమాండ్ ప్రాతిపదికన కార్మిక బడ్జెట్ రూపొందించే డిమాండ్ ఆధారిత లీగల్ ఫ్రేమ్వర్క్ నుంచి సాధారణ బడ్జెట్ కేటాయింపుల వైపు మార్పు చేయడం వల్ల రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారం పడుతోందని నిపుణులు చెబుతున్నారని మంత్రి సీతక్క సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ఎంజిఎన్ఆర్ఇజిఎస్ కింద వేతన అంశానికి 100 శాతం, మెటీరియల్ అంశానికి 75 శాతం కేంద్ర నిధులు అందుతాయి. అయితే విబి–జీ రామ్ జీ కింద ఈ నిధుల విధానాన్ని 60:40గా మార్చడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలపై భారము పెరిగింది. గత ఏడాది కేటాయించిన 12.5 కోట్ల పనిదినాల లెక్కన చూస్తే, ఎంజిఎన్ఆర్ఇజిఎస్ కింద రాష్ట్ర వాటా రూ.532.13 కోట్లు కాగా, విబి–జీ రామ్ జీ కింద అదే రాష్ట్ర వాటా రూ.2320.10 కోట్లకు పెరుగుతుంది. అంటే సుమారు రూ.1787.97 కోట్ల అదనపు ఆర్థిక భారం రాష్ట్రంపై పడుతోంది.
వ్యవసాయ కాలంలో ప్రత్యామ్నాయ నైపుణ్యం లేని వేతన ఉపాధి కొరత కారణంగా భూమిలేని కార్మికుల బేరసార శక్తి తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. 60 రోజుల వ్యవసాయ కాలపరిమితి ప్రకటనతో పాటు, సాధారణ బడ్జెట్ కేటాయింపుల కారణంగా వేతన ఉపాధి అందుబాటులో లేకపోతే పట్టణాల వైపు వలసలు పెరిగే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.
ఇక ఎంజిఎన్ఆర్ఇజిఎస్ కింద గ్రామీణ కుటుంబాలకు నేరుగా ఉపయోగపడే వేతన సమగ్ర పనుల సంఖ్యను తగ్గించి, విబి–జీ రామ్ జీ కింద ఫలితాల ఆధారిత పనుల వైపు దృష్టి మళ్లించడం పేదలకు నష్టం కలిగించేదిగా మారుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. సాంకేతికతపై అధిక ఆధారపడటం వల్ల వేతన ఉపాధి కోరేవారిలో కొందరు పథకానికి దూరమయ్యే పరిస్థితి కూడా తలెత్తవచ్చని పేర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో పేదలకు వ్యతిరేకంగా ఉన్న విబి–జీ రామ్ జీ విధానాన్ని సభ్యులంతా వ్యతిరేకించాలని, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహాత్మాగాంధీ పేరును తిరిగి పథకంలో చేర్చాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలోని మూల సూత్రాలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.
