మన భారత్, తలమడుగు
దేవాపూర్ వంతెన మరమ్మతు పనులకు శ్రీకారం.. ప్రజాప్రతినిధుల విజ్ఞప్తితో వేగంగా స్పందించిన అధికారులు
తలమడుగు, జూలై 11 (మన భారత్): భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న దేవాపూర్ వంతెన మరమ్మతు పనులను జిల్లా యంత్రాంగం వేగంగా ప్రారంభించింది. ప్రజాప్రతినిధుల విజ్ఞప్తికి స్పందించిన జిల్లా పరిపాలన, ప్రజా నిర్మాణ శాఖ అధికారులు శనివారం నుంచి మరమ్మతు పనులను చేపట్టడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
కొద్ది రోజుల క్రితం తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామ సమీపంలోని పురాతన వంతెన భారీ వర్షాలకు దెబ్బతింది. వంతెన ఒక వైపున భారీ గుంత ఏర్పడటంతో ఇసుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు గుంతలో పడిన ఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పినప్పటికీ, వంతెన పరిస్థితి స్థానిక ప్రజల్లో ఆందోళన కలిగించింది.
ఈ వంతెనపై దేవాపూర్తో పాటు సుమారు 20 గ్రామాల ప్రజలు ప్రతిరోజూ రాకపోకలు సాగిస్తుండటంతో వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, గ్రామ సర్పంచ్ సంతోష్, గ్రామ నాయకులు ప్రజా నిర్మాణ శాఖ ఈఈ శివరాం రాథోడ్, డిప్యూటీ ఈఈ రాజేష్ దృష్టికి తీసుకెళ్లారు.
విషయాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా దృష్టికి తీసుకెళ్లగా, ఆయన ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు వంతెనను పరిశీలించి అత్యవసర మరమ్మతు పనులను ప్రారంభించారు. దీంతో ప్రజలకు రాకపోకల్లో ఏర్పడిన ఇబ్బందులు త్వరలోనే తొలగనున్నాయని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని వెంటనే స్పందించి పనులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ప్రజా నిర్మాణ శాఖ ఈఈ శివరాం రాథోడ్, డిప్యూటీ ఈఈ రాజేష్తో పాటు సంబంధిత అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంతోష్, ఉప సర్పంచ్ శ్రీరామ్ యాదవ్, గ్రామస్థులు సిలర్, వెంకన్న యాదవ్, లచ్చన్న, శ్రీను యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వంతెన మరమ్మతు పనులు నాణ్యతతో, వేగంగా పూర్తి చేసి ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని గ్రామస్థులు కోరారు.
మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి
