మన భారత్, తలమడుగు
డోర్లి గ్రామంలో నూతన ప్రభుత్వ పాఠశాల భవనం ప్రారంభం
పిల్లలను ప్రతిరోజూ బడికి పంపి వారి భవిష్యత్తుకు బాటలు వేయాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా
తలమడుగు, జూలై 10:
గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను ప్రతిరోజూ పాఠశాలకు పంపించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు.
శుక్రవారం తలమడుగు మండలం డోర్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాన్ని కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం పాఠశాల ఆవరణను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి రావడం వల్ల ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతుందని తెలిపారు. విబిజి రామ్ జీ స్కీమ్ ద్వారా జిల్లాలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు.
గతంతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు గణనీయంగా మెరుగయ్యాయని, ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకొని పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపాలని సూచించారు. విద్యార్థుల అభ్యాస నైపుణ్యాలను పెంపొందించేలా ఉపాధ్యాయులు ప్రతిరోజూ హోంవర్క్ ఇవ్వడంతో పాటు చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ప్రధానోపాధ్యాయులకు ఆదేశించారు.
పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత లేకుండా అవసరమైన అదనపు సిబ్బందిని త్వరలోనే నియమించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. గతంలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన సమయంలో గ్రామస్థులు పాఠశాల భవన సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని, వాటిపై వెంటనే స్పందించి నూతన భవన నిర్మాణాన్ని పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు.
ఈ సందర్భంగా నాణ్యమైన భవన నిర్మాణానికి కృషి చేసిన ఇంజినీరింగ్ శాఖ అధికారులు, గ్రామ సర్పంచ్, కాంట్రాక్టర్తో పాటు సంబంధిత అధికారులను కలెక్టర్ అభినందించారు.
కార్యక్రమం అనంతరం పాఠశాల ఆవరణలో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి కలెక్టర్ మొక్క నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి, పంచాయతీరాజ్ ఈఈ శివరాం , ఎమ్మార్వో రాజ్ మోహన్, ఎంపీడీవో శంకర్, గ్రామ సర్పంచ్ పూజ, మాజీ జడ్పీటీసీ గణేష్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు రవీందర్, ఉపాధ్యాయులు, గ్రామస్థులు, విద్యార్థులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి
