మన భారత్ | ఆదిలాబాద్
ప్రతి పాఠశాలలో కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేయాలి.. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కలెక్టర్ రాజర్షి షా ఆదేశాలు
ఆదిలాబాద్, జూలై 7 (మన భారత్): జిల్లాలోని ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థుల కోసం కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేయాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు పాఠశాలలో ఎదురయ్యే సమస్యలను నిర్భయంగా తెలియజేసేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.
విద్యార్థులు చదువుకు సంబంధించిన సమస్యలు, పాఠశాల వాతావరణం, మౌలిక వసతులు లేదా ఇతర ఇబ్బందులపై తమ అభిప్రాయాలు, ఫిర్యాదులను గోప్యంగా కంప్లైంట్ బాక్స్లో వేయవచ్చని విద్యార్థులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.
కంప్లైంట్ బాక్స్ తాళం చెవి (కీ) సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడి వద్ద ఉండాలని, ప్రతి నెల ఒకసారి బాక్స్ను తెరిచి అందులో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమస్యల స్వభావాన్ని బట్టి సంబంధిత అధికారులకు సమాచారం అందించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పాఠశాలలను తనిఖీ చేసే అధికారులు తమ పర్యటనల సందర్భంగా కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేశారా లేదా అనే అంశాన్ని తప్పనిసరిగా పరిశీలించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అలాగే బాక్స్ ఏర్పాటు చేయడమే కాకుండా, దాని వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించడం కూడా పాఠశాల యాజమాన్యాల బాధ్యత అని పేర్కొన్నారు.
విద్యార్థులు తమ సమస్యలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే వాతావరణం కల్పించడం ద్వారా పాఠశాలల్లో పారదర్శకత, భద్రత, విద్యార్థి సంక్షేమం మరింత మెరుగుపడుతుందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు.
గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
