జామిడి గ్రామంలో పచ్చదనానికి యువత ముందడుగు
మన భారత్, తలమడుగు మండలం:
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని, గ్రామాలను పచ్చదనంతో నింపాలని జామిడి గ్రామ సర్పంచ్ ఈరగొల్ల అశోక్ ఇచ్చిన పిలుపుకు గ్రామ యువత మంచి స్పందన ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో పుట్టినరోజు జరుపుకుంటున్న ఆత్మీయ మిత్రుడు మునేశ్వర్ సృజయ్ గురువారం జామిడి గ్రామంలో రెండు పండ్ల మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యమయ్యారు.
గ్రామంలో ఎవరైనా పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి ప్రత్యేక సందర్భాల్లో కనీసం రెండు పండ్ల మొక్కలు నాటాలని సర్పంచ్ ఈరగొల్ల అశోక్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి స్పందించిన సృజయ్ తన పుట్టినరోజును ప్రత్యేకంగా మార్చుకుంటూ పండ్ల మొక్కలు నాటడం గ్రామస్థుల ప్రశంసలు అందుకుంది.
ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, యువకులు మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన వాతావరణం అందించాలంటే ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తరించాలని అభిప్రాయపడ్డారు.
గ్రామాన్ని పచ్చదనంతో తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగస్వామ్యమైన మునేశ్వర్ సృజయ్కు గ్రామ ప్రజలు ప్రత్యేక అభినందనలు తెలిపారు. యువత సామాజిక బాధ్యతతో ముందుకు రావడం ఆనందదాయకమని పేర్కొన్నారు.
పర్యావరణ పరిరక్షణకు మొక్కలే ప్రధాన ఆధారం కావడంతో ప్రతి ఇంటి వద్ద కనీసం ఒక మొక్కను పెంచాలని గ్రామస్తులకు పిలుపునిచ్చారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
