ఝరి గ్రామంలో ఉచిత కంటి పరీక్ష శిబిరం విజయవంతం
– కంటి ఆరోగ్యంపై అవగాహన కల్పించిన వైద్యులు
మన భారత్, తలమడుగు:
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని ఝరి గ్రామంలో బుధవారం ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరాన్ని మావలలోని ప్రముఖ L V Prasad Eye Institute వైద్య బృందం ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
శిబిరంలో గ్రామానికి చెందిన వృద్ధులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ కంటి ఆరోగ్యాన్ని పరీక్షించించుకున్నారు. వైద్యులు ప్రతి ఒక్కరికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి కంటి చూపు సమస్యలు, ముత్యబిందు లక్షణాలు, కంటి సంరక్షణ పద్ధతులపై అవగాహన కల్పించారు. అవసరమైన వారికి మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి రావాలని సూచించారు.
ఈ సందర్భంగా వైద్య బృందం మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో కంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని, సమయానికి పరీక్షలు చేయించుకుంటే అనేక సమస్యలను నివారించవచ్చని తెలిపారు. కంటి ఆరోగ్యంపై ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా తరచూ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మెస్రం కాశీరాం పాల్గొని గ్రామ ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. గ్రామాల్లో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం వల్ల పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. అలాగే బీజేవైఎం మండల అధ్యక్షులు దాతాజీ కిరణ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం అభినందనీయమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో విలాస్, సాయి, ఏఎన్ఎం ఇస్తారీ బాయి తదితరులు పాల్గొని శిబిరం విజయవంతానికి సహకరించారు. గ్రామ ప్రజలు ఉచిత వైద్య సేవలను అందించిన L V Prasad Eye Institute వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.
–గొంటి ముక్కుల ప్రసాద్, మన భారత్ జర్నలిస్ట్.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
