100 మందికి కంటి పరీక్షలు
– 15 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు, అద్దాలు పంపిణీ
మన భారత్, తలమడుగు:
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని లచ్చంపూర్ గ్రామంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది. తలమడుగు మండల బీజేవైఎం మండల అధ్యక్షులు దాతజీ కిరణ్ చొరవతో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరానికి గ్రామ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆదిలాబాద్కు చెందిన ప్రముఖ LV Prasad Eye Institute వైద్య బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో గ్రామానికి చెందిన సుమారు 100 మంది ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. వైద్యులు ప్రతి ఒక్కరిని పరీక్షించి కంటి సమస్యలను గుర్తించారు. పరీక్షల అనంతరం కంటి సమస్యలతో బాధపడుతున్న 15 మంది రోగులను ఎంపిక చేసి వారికి ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు.
అదేవిధంగా కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న పలువురికి ఉచితంగా మందులు, కండ్ల అద్దాలు పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేద మరియు వృద్ధులకు ఇలాంటి ఉచిత వైద్య సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని గ్రామస్థులు తెలిపారు. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ప్రజలు అభినందించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. ప్రజల ఆరోగ్యమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాడవి జంగు, తెలంగా రావు, LV Prasad Eye Institute సిబ్బంది లోఖండే విలాస్, సాయిప్రగత్, ఆశ కార్యకర్త గంగుబాయి, గ్రామ పెద్దలు, యువకులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
-గొంటి ముక్కుల ప్రసాద్, మన భారత్ జర్నలిస్ట్
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
