బొండపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
పోలీసుల తక్షణ స్పందనపై బాధితురాలి కృతజ్ఞతలు
మన భారత్ | విజయనగరం జిల్లా
విజయనగరం జిల్లా గజపతినగరానికి చెందిన ఓ దళిత మహిళపై కుల దూషణకు పాల్పడ్డారనే ఆరోపణలపై బొండపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. బాధితురాలు గూడేపు గౌరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం గజపతినగరంలో నివాసం ఉంటున్న గూడేపు గౌరి ఈ నెల 24న తన తల్లిదండ్రులను కలిసేందుకు బొండపల్లి మండలంలోని అంబటివలస గ్రామపంచాయతీ పరిధిలోని రోల్లవాక గ్రామానికి వెళ్లింది. అదే రోజు సాయంత్రం రోల్లవాక ఐస్ ఫ్యాక్టరీ రోడ్డులో గ్రామానికి చెందిన కొర్నాన అప్పలనాయుడు అనే వ్యక్తి తనను అడ్డగించి కులం పేరుతో దూషించి బెదిరించాడని ఆమె ఆరోపించింది.
ఈ ఘటనపై మంగళవారం రాత్రి బొండపల్లి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించిన గూడేపు గౌరి ఫిర్యాదు మేరకు పోలీసులు కొర్నాన అప్పలనాయుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. బాధితురాలికి అన్యాయం జరిగిందని తెలుసుకున్న వెంటనే స్పందించి కేసు నమోదు చేసిన పోలీసు అధికారులకు, ముఖ్యంగా బొబ్బిలి డీఎస్సీ గోవిందరాజుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే ఈ విషయాన్ని అఖిల భారత మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్లినట్లు బాధితురాలు పేర్కొన్నారు. దళితులపై జరిగే వివక్ష, దాడులపై చట్టపరమైన చర్యలు కఠినంగా అమలు చేయాలని సామాజిక వర్గాలు కోరుతున్నాయి.
పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
