అశోక్ బుద్ధ విహార్లో 91వ వర్ధంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహణ
“మాతా రమాయి త్యాగాలు సమాజానికి ఆదర్శం” – వక్తలు
మన భారత్ | ఆదిలాబాద్
త్యాగమూర్తి మాతా రమాయి అంబేద్కర్ గారి 91వ వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కైలాస్ నగర్లోని అశోక్ బుద్ధ విహార్ వద్ద ఘన నివాళి కార్యక్రమం నిర్వహించారు. సమతా సైనిక్ దళ్ మరియు మాతా రమాయి మహిళా మండలి సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వందలాది మంది బౌద్ధ ఉపాసకులు, ఉపాసికలు, మహిళలు, యువకులు, సామాజిక కార్యకర్తలు పాల్గొని మాతా రమాయి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
కార్యక్రమం ప్రారంభంలో బౌద్ధ ప్రార్థనలు నిర్వహించగా “నమో బుద్ధాయ – జై భీమ్” నినాదాలతో ప్రాంగణం మార్మోగింది. అనంతరం పలువురు వక్తలు మాతా రమాయి అంబేద్కర్ గారి జీవిత విశేషాలను స్మరించుకున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత పోరాటంలో మాతా రమాయి గారి పాత్ర అమూల్యమని కొనియాడారు. బాబాసాహెబ్ విద్యాభ్యాసం, సామాజిక ఉద్యమాలు, అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం చేసిన పోరాటంలో రమాయి గారు ఎన్నో కష్టాలు భరించి ఆయనకు అండగా నిలిచారని గుర్తుచేశారు.
వక్తలు మాట్లాడుతూ నేటి సమాజం అభివృద్ధి చెందుతూ సౌకర్యవంతమైన జీవితం గడుపుతున్నప్పటికీ, ఆ మార్పుకు పునాది వేసిన మహామాత మాతా రమాయి త్యాగాలను ఎప్పటికీ మరవకూడదన్నారు. కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూ సమాజ మార్పు కోసం బాబాసాహెబ్ ఆశయాలకు మద్దతుగా నిలవడం ఆమె గొప్పతనమని పేర్కొన్నారు.
అలాగే సమాజంలో ప్రతి ఒక్కరూ కేవలం భౌతిక అభివృద్ధికే పరిమితం కాకుండా సమానత్వం, సేవాభావం, త్యాగం వంటి విలువలను అలవరచుకోవాలని సూచించారు. యువత బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు మాతా రమాయి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని, విద్య మరియు సామాజిక చైతన్యంతో సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా మహిళలు, యువకులు, బౌద్ధ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని మాతా రమాయి గారి సేవలను స్మరించుకున్నారు. చివరగా బుద్ధ వందనాలతో కార్యక్రమం ముగిసింది.
నమో బుద్ధాయ… జై భీమ్!
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
