మన భారత్ ,హైదరాబాద్:
శుభక్షేత్ర ప్రైవేట్ లిమిటెడ్ పేరిట కోట్ల రూపాయల ఆర్థిక మోసం జరిగిన కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. ఈ కేసులో Mangli పాత్రపై కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. సైబరాబాద్ ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ (EOW) అధికారులు సాంకేతిక ఆధారాలు సేకరిస్తూ విచారణను ముందుకు తీసుకెళ్తున్నారు.
పోలీసుల సమాచారం ప్రకారం, మంగ్లీ సోదరుడు శివ, రమావత్ మధు, హేమకాంత్ రెడ్డి ఈ మోసంలో ప్రధాన పాత్రధారులుగా ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటికే రమావత్ మధును అరెస్టు చేసి రిమాండ్కు తరలించగా, అతడిని పోలీస్ కస్టడీకి తీసుకునేందుకు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శనివారం విచారణ అనంతరం కస్టడీపై నిర్ణయం వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
ఇదే ముఠా గతంలో నల్లగొండ జిల్లాలో ‘గోకుల నంద ఇన్ఫ్రా’ పేరిట కోట్ల రూపాయల మోసం చేసిన కేసుల్లో కూడా సీఐడీ ఇప్పటికే ఐదు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసులు విచారణలో ఉండగానే ‘ఏకం విత్ నేచర్’ అనే థీమ్తో కొత్తగా శుభక్షేత్ర ప్రైవేట్ లిమిటెడ్ పేరిట పెట్టుబడులు ఆహ్వానించి మళ్లీ మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పెట్టుబడిదారులకు రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే 101 గజాల స్థలం రిజిస్ట్రేషన్తో పాటు నెలకు 5 శాతం రాబడి 42 నెలలపాటు వస్తుందని హామీ ఇచ్చి అమాయకులను బురిడీ కొట్టించినట్లు విచారణలో తేలుతోంది. ఈ విధంగా గిరిజనులు, లంబాడీ వర్గాలకు చెందిన పలువురు బాధితుల నుంచి కోట్ల రూపాయలు దోచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ప్రస్తుతం పరారీలో ఉన్న శివ, హేమకాంత్ రెడ్డి సహా మరికొందరి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. వారు ఆంధ్రప్రదేశ్లోని తిరుమల-తిరుపతి ప్రాంతంలో తలదాచుకున్నారనే అనుమానంతో ప్రత్యేక బృందాలు వెతుకుతున్నాయి.
ఇక బాధితులు న్యాయం కోసం గిరిజన సంఘాల ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సమావేశమై తమ ఆవేదన వ్యక్తం చేశారు. తాము తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా, ఈ కేసుకు సంబంధించి పంజాగుట్ట పోలీసుల వ్యవహారంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయవాది సుబ్బారావుకు సంబంధించిన ఘటనపై ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదని ప్రశ్నిస్తూ, సీసీ కెమెరా ఫుటేజీ భద్రతపై కూడా వివరణ కోరింది. ఈ కేసు తదుపరి విచారణను వేసవి సెలవుల అనంతరం చేపట్టనుంది.
ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా ఆర్థిక మోసాలపై ఆందోళన పెరిగింది. పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
