మన భారత్, ఆదిలాబాద్ :
నెరడిగొండ మండల కేంద్రంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు కింద అంగన్వాడీ సిబ్బందికి 5G మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నియోజకవర్గంలోని బోథ్, సోనాల, ఇచ్చొడ, నెరడిగొండ, బజార్ హత్నూర్, సిరికొండ మండలాలకు చెందిన మొత్తం 289 మంది అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లకు ఫోన్లు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బందికి సాంకేతిక సౌకర్యాలు కల్పించడం మంచిదేనని, అయితే ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా సమయానికి నెరవేర్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అంగన్వాడీ సిబ్బంది గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల పోషణ, విద్యాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన కొనియాడారు.
డిజిటల్ సదుపాయాల ద్వారా సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు ఈ ఫోన్లు ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ కావడంలో అంగన్వాడీ సిబ్బంది పాత్ర ముఖ్యమని అన్నారు.
ఈ కార్యక్రమంలో సీడీపీవో ఇంచార్జి వినూత్న, బ్లాక్ కోఆర్డినేటర్ శివాజీ, మండల సూపర్వైజర్లు లలిత, మంజుల, విమల, మౌనిక, జంగుబాయి, సుమలతతో పాటు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
