మన భారత్, ఆదిలాబాద్ జిల్లా:
ఆదిలాబాద్ జిల్లాలోని బజార్ హత్నూర్ మండల కేంద్రంలో మొక్కజొన్న రైతులకు ఉపశమనం కలిగించే విధంగా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో పీఏసీఎస్ బజార్ హత్నూర్ ద్వారా ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని సోమవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు.
కేంద్రం ప్రారంభించిన అనంతరం మొక్కజొన్న రైతును ఎమ్మెల్యే సన్మానించి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు సరైన ధర లభించేలా ప్రభుత్వం ప్రతి గింజను కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. రైతులు దళారులపై ఆధారపడకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు.
రైతులు ఎంతో కష్టపడి పండించిన పంటలకు న్యాయమైన ధర అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రం ప్రారంభంతో ప్రాంతీయ రైతులకు ఊరట లభిస్తుందని స్థానికులు అభిప్రాయపడ్డారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి
