మన భారత్, ఆదిలాబాద్:
జిల్లా వ్యాప్తంగా పోలీసు సిబ్బందితో సమన్వయం, పనితీరు మెరుగుదలకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆధ్వర్యంలో సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం సుమారు 30 నిమిషాల పాటు కొనసాగింది. జిల్లాలోని అన్ని స్థాయి పోలీసు అధికారులు, సిబ్బంది ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ ప్రతి పోలీసు సిబ్బంది తమ విధుల్లో అంకితభావంతో, నిజాయితీతో పనిచేయాలని స్పష్టం చేశారు. యూనిఫామ్ ధరిస్తూ విధుల్లో మర్యాదపూర్వక ప్రవర్తన పాటించడం పోలీసు ప్రతిష్టను పెంచుతుందని తెలిపారు. ఇటీవల జిల్లాలో నిర్వహించిన బందోబస్తులు విజయవంతంగా పూర్తి చేసినందుకు సిబ్బందిని అభినందించారు.
ఎండాకాలం నేపథ్యంలో సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. తగినంత నీరు తీసుకోవడం, ఎండలో విధులు నిర్వహించే సమయంలో రక్షణ చర్యలు పాటించడం అవసరమని తెలిపారు. “అరైవ్ అలైవ్” కార్యక్రమం విజయవంతంగా అమలు కావడం పట్ల సిబ్బందిని ప్రశంసిస్తూ, రోడ్డు ప్రమాదాల నియంత్రణలో పోలీసుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.
పోలీస్ స్టేషన్లలో రికార్డులను సకాలంలో నవీకరించి పెండింగ్ లేకుండా నిర్వహించాలని, బాధితులతో గౌరవంగా వ్యవహరిస్తూ వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. గంజాయి రవాణా, రాయితీ బియ్యం అక్రమ రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం అందించిన సిబ్బందిని ప్రోత్సహిస్తూ నగదు బహుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు.
జిల్లాలో ఓపెన్ డ్రింకింగ్ను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, కోర్టు డ్యూటీ అధికారుల పనితీరును ప్రతి వారం సమీక్షించాలని సూచించారు. నేరస్తులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే సిబ్బందికి వారాంతపు సెలవులు అందేలా చర్యలు తీసుకోవాలని, త్వరలో ఆరోగ్య శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు.
సమాజ భద్రత, ప్రజల శ్రేయస్సు కోసం పోలీసు వ్యవస్థ మరింత కట్టుదిట్టంగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
