మన భారత్, తెలంగాణ:
తెలంగాణలో రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతును ధైర్యంగా సాగు మడిలో నిలబెట్టేందుకు ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని ఆయన పేర్కొన్నారు. అన్నదాత సంతోషం కోసం అన్నగా బాధ్యత తీసుకున్నానని ఆయన వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరే విధంగా ₹9,000 కోట్ల రైతు భరోసా నిధుల విడుదలకు నేడు శ్రీకారం చుడుతున్నామని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సిద్దిపేట జిల్లా నర్మెట గ్రామ వేదికగా ప్రారంభిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

“మా పాలనలో రైతే రాజు” అనే నినాదాన్ని నిజం చేస్తూ రైతులకు ఆర్థిక భరోసా అందించడం ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు.

అదే కార్యక్రమంలో భాగంగా నర్మెటలో పామాయిల్ పరిశ్రమతో పాటు రిఫైనరీ యూనిట్కు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులు ప్రాంతీయ అభివృద్ధికి తోడ్పడటమే కాకుండా స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.

రైతులకు నేరుగా ఆర్థిక సాయం అందించడం ద్వారా వారి భారం తగ్గించడమే కాకుండా, పంటల ఉత్పత్తి పెంపు, వ్యవసాయాభివృద్ధికి ఈ పథకం దోహదపడుతుందని అధికారులు పేర్కొన్నారు. రైతు భరోసా నిధుల విడుదలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.
