మన భారత్, ఆదిలాబాద్
గంజాయి, మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్
రీజోనెన్స్ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం – చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లోనూ రాణించాలని సూచన
ఆదిలాబాద్ జిల్లా యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ పిలుపునిచ్చారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు విద్యార్థుల జీవితాలను, కుటుంబాలను, సమాజ భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీస్తాయని ఆయన హెచ్చరించారు. విద్యార్థులు తమ భవిష్యత్తును ప్రకాశవంతంగా తీర్చిదిద్దుకోవాలంటే చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర సృజనాత్మక రంగాల్లోనూ ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు.
శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని రీజోనెన్స్ పాఠశాలలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల అలవాటు యువతలో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసి వారి విద్య, ఉపాధి, కుటుంబ జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అన్నారు. ఒక్కసారి అలవాటు అయితే దాని నుంచి బయటపడటం చాలా కష్టమని, అందువల్ల మొదటి నుంచే వాటికి పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు.
విద్యార్థులు తమ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ చదువుతో పాటు క్రీడలు, కళలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సృజనాత్మక కార్యకలాపాల్లో పాల్గొంటే వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందని తెలిపారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చని పేర్కొన్నారు.
గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాల విక్రయాలు, వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని, సమాజాన్ని మాదక ద్రవ్యాల రహితంగా మార్చేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే విద్యార్థుల భవిష్యత్తు బలంగా ఉండాలని, అందుకోసం ప్రతి విద్యార్థి చదువుపై పూర్తి దృష్టి సారించి బాధ్యతాయుతమైన పౌరుడిగా ఎదగాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకాంక్షించారు.
ఈ అవగాహన కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, మావల సీఐ బి.డి. ప్రేమ్ కుమార్, రీజోనెన్స్ పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన పెంపొందించుకున్నారు.
మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్..
మన భారత్ లో పని చేయుటకు జిల్లా స్టాప్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గ, మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి
