మన భారత్, న్యూఢిల్లీ:
అంతర్జాతీయ క్రీడా వేదికపై భారత్ మరో కీలక మైలురాయిని అందుకుంది. వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్-2028 నిర్వహణకు ఆతిథ్య హక్కులు భారత్కు దక్కాయి. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ నిర్వహణ కోసం భారత్, న్యూజిలాండ్ మధ్య గట్టి పోటీ నెలకొనగా, చివరికి భారత్కే అవకాశం దక్కడం విశేషంగా నిలిచింది.

ఈ పోటీల నిర్వహణకు ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ నగరాన్ని ఎంపిక చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మౌలిక వసతులు, క్రీడా సదుపాయాలు పరిశీలించిన అనంతరం భువనేశ్వర్కు అనుమతి లభించింది. గత కొన్నేళ్లుగా ఒడిశా ప్రభుత్వం క్రీడా రంగానికి ఇచ్చిన ప్రాధాన్యం, అంతర్జాతీయ స్థాయి మైదానాల అభివృద్ధి ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు.

దీంతో ఆసియా ఖండంలో జపాన్, ఖతర్, చైనా దేశాల తర్వాత వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న నాలుగో దేశంగా భారత్ నిలిచింది. ఇది భారత క్రీడా రంగానికి గొప్ప గుర్తింపుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉండగా వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్-2026 పోలాండ్లో నేడు ప్రారంభం కానుంది. ఈ పోటీల ద్వారా ప్రపంచ అథ్లెట్లు తమ ప్రతిభను ప్రదర్శించనుండగా, 2028లో భారత్ వేదికగా జరగనున్న ఈవెంట్పై ఇప్పటినుంచే ఆసక్తి నెలకొంది.

భారత్లో ఈ తరహా అంతర్జాతీయ ఈవెంట్లు పెరగడం ద్వారా క్రీడా మౌలిక వసతులు మరింత అభివృద్ధి చెందడమే కాకుండా యువ అథ్లెట్లకు ప్రోత్సాహం లభిస్తుందని క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు.
