మన భారత్, న్యూఢిల్లీ:
బ్యాంకుల వివిధ ఛార్జీలపై పార్లమెంటులో తీవ్ర చర్చకు దారి తీసింది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాజ్యసభ సభ్యుడు Raghav Chadha బ్యాంకింగ్ వ్యవస్థలో అమలవుతున్న కనీస బ్యాలెన్స్, ATM వినియోగం, SMS అలర్ట్ల వంటి సేవలపై వసూలు చేస్తున్న ఫీజులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బ్యాంకులు నిబంధనల పేరుతో సామాన్యుల కష్టార్జితాన్ని దోచుకుంటున్నాయని మండిపడ్డారు.
పార్లమెంటు సమావేశాల సందర్భంగా మాట్లాడిన ఆయన, కనీస బ్యాలెన్స్ నిలుపుకోలేకపోతే విధించే జరిమానాలు, నిర్దిష్ట పరిమితి దాటితే ATM ఛార్జీలు, ప్రతి లావాదేవీకి SMS ఛార్జీలు విధించడం వంటివి సాధారణ కుటుంబాలపై అదనపు భారం మోపుతున్నాయని పేర్కొన్నారు. చిన్న మొత్తాల పొదుపు చేసే ప్రజల ఖాతాల నుంచే ఈ విధంగా చిల్లులు పెడుతున్నారని విమర్శించారు.

బ్యాంకింగ్ వ్యవస్థలో పారదర్శకత పెంచి, ఛార్జీల విధానంపై స్పష్టమైన మార్గదర్శకాలు తీసుకురావాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, తక్కువ ఆదాయం కలిగిన వర్గాలపై ఈ ఛార్జీల ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పారు. బ్యాంకులు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే సేవలపై సముచిత రుసుములు మాత్రమే విధించాలని సూచించారు.
సామాన్యుల పొదుపును రక్షించడం ప్రభుత్వ బాధ్యత అని, అవసరమైతే నియంత్రణ సంస్థలు కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కోరారు. బ్యాంకింగ్ రంగంలో వినియోగదారుల హక్కులను కాపాడేలా చట్టపరమైన మార్పులు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇప్పటికే పెరుగుతున్న జీవన వ్యయాల మధ్య బ్యాంకు ఛార్జీలు అదనపు భారం అవుతున్నాయని పలువురు సభ్యులు కూడా అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
