తలమడుగు | జూలై 19 మన భారత్ ప్రతినిధి|
వానల కోసం గ్రామ దేవతలకు జలాభిషేకాలు.. తలమడుగులో మహిళల ప్రత్యేక పూజలు
తలమడుగు: వర్షాలు సమృద్ధిగా కురిసి రైతుల పొలాలు పచ్చగా కళకళలాడాలని ఆకాంక్షిస్తూ తలమడుగు మండల కేంద్రంలోని మహిళలు ఆదివారం గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని మహిళలంతా ఏకమై భక్తిశ్రద్ధలతో పాదయాత్రగా గ్రామ దేవతల ఆలయాలకు చేరుకుని అమ్మవార్లకు జలాభిషేకాలు చేశారు. అనంతరం సంప్రదాయబద్ధంగా కప్ప తల్లి ఆట ఆడుతూ గ్రామ దేవతలను ప్రార్థించారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో వర్షాభావ సమయంలో గ్రామ దేవతలకు జలాభిషేకాలు, కప్పతల్లి ఆట వంటి ఆచారాలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల కారణంగా ఇప్పటికే విత్తనాలు వేసిన రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్న నేపథ్యంలో, వానలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని మహిళలు అమ్మవారిని వేడుకున్నారు. చెరువులు, కుంటలు నిండిపోవడంతో పాటు రైతుల కష్టాలు తొలగి గ్రామంలో సుభిక్షం నెలకొనాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఎలుగు రాజన్న (చంటి) మాట్లాడుతూ, రైతుల సంక్షేమం కోసం గ్రామ ప్రజలంతా ఒక్కటై సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రకృతి అనుగ్రహంతో త్వరలోనే విస్తారంగా వర్షాలు కురిసి రైతుల ఆశలు ఫలించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, రైతులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించారు. భక్తిశ్రద్ధల మధ్య జరిగిన ఈ కార్యక్రమం గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
