మన భారత్ | జూలై 19 బాన్సువాడ:
బహుజనుల వ్యతిరేక పార్టీలను ఓడించాలి: బీఎస్పీ నేత అడ్వకేట్ నిషాని రామచంద్రం పిలుపు
బాన్సువాడ, జూలై 19: దేశంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు బహుజనుల ప్రయోజనాలను విస్మరిస్తున్నాయని, రానున్న ఎన్నికల్లో వాటికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) చీఫ్ జోన్ ఇన్చార్జ్ అడ్వకేట్ నిషాని రామచంద్రం పిలుపునిచ్చారు.
బాన్సువాడలోని రోడ్డు భవనాల అతిథి గృహంలో నిర్వహించిన జహీరాబాద్ పార్లమెంట్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశానికి ముందు మహాత్మా జ్యోతిరావు ఫూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్, మాన్యవర్ కాన్షీరామ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ నెల 26న కామారెడ్డిలో నిర్వహించే ఛత్రపతి సాహూజీ మహారాజ్ రిజర్వేషన్ దినోత్సవ సభకు యువత, బహుజనులు, పార్టీ శ్రేణులు వేలాదిగా హాజరై విజయవంతం చేయాలని కోరారు.
దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ బహుజన వర్గాల సంక్షేమానికి అనుకూలంగా పనిచేయడం లేదని ఆయన విమర్శించారు. రిజర్వేషన్ల అమలులో నిర్లక్ష్యం, వెనుకబడిన వర్గాల అభివృద్ధిలో వైఫల్యం వంటి అంశాలపై ఆయన విమర్శలు గుప్పించారు.
అలాగే బహుజన సమాజ్ పార్టీ స్థాపకుడు మాన్యవర్ కాన్షీరామ్ ఉద్యమాల ఫలితంగానే వెనుకబడిన వర్గాలకు 27 శాతం రిజర్వేషన్లు అమలులోకి వచ్చాయని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, బహుజనుల హక్కుల సాధన కోసం బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు బెహన్ కుమారి మాయావతి నాయకత్వంలో ఉద్యమాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో జోన్ ఇన్చార్జ్ గైని గంగాధర్, జహీరాబాద్ పార్లమెంట్ ఇన్చార్జ్ ఉబ్బిత్వార్ రోహిదాస్, జిల్లా అధ్యక్షుడు మాలోత్ హరిలాల్ నాయక్, కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బండకాడి పరశురాములు, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు గొల్ల సతీష్, ప్రధాన కార్యదర్శి అశోక్, ఈసీ సభ్యుడు బస్కే కృష్ణ, బాన్సువాడ అసెంబ్లీ అధ్యక్షుడు అక్కగారి జగన్, ఎల్లారెడ్డి నాయకుడు సాయిబాబు, జుక్కల్ అసెంబ్లీ ఇన్చార్జ్ రాసమల్ల బాబు, అసెంబ్లీ అధ్యక్షుడు బంగారి జైపాల్తో పాటు రెండు జిల్లాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
