మన భారత్, ఆదిలాబాద్:
అనేక సంవత్సరాలుగా ఆదిలాబాద్ ప్రజల కలగా ఉన్న ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కీలక ముందడుగు పడింది. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ మాస్టర్ ప్లాన్కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు ఎంపీ గోడం నగేష్ వెల్లడించారు. స్థానిక శాసనసభ్యుడు పాయల్ శంకర్తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర పౌరవిమానయన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు కూడా ధన్యవాదాలు తెలిపారు.

ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తయితే ఉత్తర తెలంగాణ అభివృద్ధికి కొత్త దిశ లభిస్తుందని, పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక రంగాలకు ఇది ఊతమిస్తుందని పేర్కొన్నారు. మాస్టర్ ప్లాన్ ఆమోదం తర్వాత త్వరలోనే ప్రాథమిక పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు.
ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ తాటిపల్లి గంగాధర్ రావు, మున్సిపల్ కౌన్సిలర్లు లాలా మున్నా, ధోనీ జ్యోతి, జిల్లా ఉపాధ్యక్షులు బోండ్ల వెంకటస్వామి, కనపర్తి చంద్రకాంత్, వామన్ పటేల్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
