మన భారత్ తెలంగాణ:
తెలంగాణ రాష్ట్రంలోని ఇంజినీరింగ్ విద్యార్థులకు ఫీజుల విషయంలో ఊరట లభించనున్నట్లు సమాచారం. తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (TAFRC) తాజా ప్రతిపాదనల ప్రకారం కొన్ని ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫీజులను తగ్గించగా, అధిక శాతం కాలేజీలకు గతంలో అమలులో ఉన్న ఫీజులనే కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వివరాల ప్రకారం సుమారు 10 నుంచి 15 కళాశాలల్లో పాత ఫీజులపై కోత విధించినట్లు సమాచారం. అదే సమయంలో 20 లోపు కళాశాలలకు 10 నుండి 15 శాతం వరకు స్వల్ప పెంపు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనలపై తుది నిర్ణయం ఇంకా వెలువడాల్సి ఉంది.
ఈ ఫీజు నిర్మాణానికి సంబంధించిన దస్త్రం ప్రస్తుతం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పరిశీలనలో ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యమంత్రి ఆమోదం అనంతరం అధికారిక జీవో విడుదల కానుంది.
2025-28 బ్లాక్ పీరియడ్కు ఈ ఫీజు నిర్మాణం వర్తించేలా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. విద్యార్థులు, తల్లిదండ్రులు తుది ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్నారు.
