మన భారత్, హైదరాబాద్:
పసిడి పరుగులు ఆగడం లేదు. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, డాలర్ మారకపు విలువల్లో హెచ్చుతగ్గులు, భౌగోళిక రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో బంగారం ధరలు రోజురోజుకూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ పరిణామాల ప్రభావంతో ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరాయి.
తాజా ధరల ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రిటైల్ ధర 3 శాతం జీఎస్టీతో కలిపి ఏకంగా రూ.1,85,000ను దాటింది. గత కొన్ని రోజులుగా స్వల్పంగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు ఇవాళ ఒక్కసారిగా భారీగా ఎగబాకడంతో కొనుగోలుదారులు, ఆభరణాల వ్యాపారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ పెరగడం, సురక్షిత పెట్టుబడిగా ఇన్వెస్టర్లు పసిడిపై దృష్టి పెట్టడం, అలాగే డాలర్ బలహీనత వంటి అంశాలు ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో కూడా బంగారం ధరల్లో స్థిరత్వం కంటే ఒడిదుడుకులే ఎక్కువగా ఉండే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
ధరలు భారీగా పెరగడంతో సాధారణ కొనుగోలుదారులు వెనుకడుగు వేస్తుండగా, పెట్టుబడిదారులు మాత్రం దీర్ఘకాల లాభాల దృష్ట్యా ఆసక్తి చూపుతున్నట్లు బులియన్ మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
