మన భారత్, మహారాష్ట్ర:
మహారాష్ట్రలో జరిగిన విమాన ప్రమాదంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ప్రాథమిక దర్యాప్తులో ల్యాండింగ్ సమయంలో సరైన వెలుతురు లేకపోవడమే ఈ ఘటనకు ప్రధాన కారణంగా తేలినట్లు ఆయన తెలిపారు. రన్వే వద్ద తగిన లైటింగ్ వ్యవస్థ అందుబాటులో లేకపోవడం వల్లే ప్రమాదం చోటుచేసుకున్నట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని వివరించారు.
ఈ ఘటనపై పూర్తి స్థాయి, పారదర్శక విచారణ జరిపిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. బాధ్యులెవరో నిర్ధారించి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు, ఘటనపై ప్రత్యక్షంగా సమీక్షించేందుకు కాసేపట్లోనే రామ్మోహన్ నాయుడు ప్రమాద స్థలానికి వెళ్లనున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా, మహారాష్ట్రలోని బారామతి ప్రాంతంలో ఈ ఉదయం విమానం కుప్పకూలిన ఘటనపై దేశవ్యాప్తంగా కలకలం రేగింది. ఈ ప్రమాదానికి సంబంధించి పలు అంశాలపై దర్యాప్తు కొనసాగుతుండగా, అధికారిక నివేదిక వెలువడాల్సి ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
