రూ.5 వేల పెట్టుబడితో భారీ లాభాల మాయ
మన భారత్, తెలంగాణ :
హైదరాబాద్లో సైబర్ నేరగాళ్ల మోసాలకు మరో ఐటీ ఉద్యోగి బలయ్యాడు. కేవలం రూ.5 వేల పెట్టుబడితో భారీ లాభాలు వస్తాయన్న ఆశ చూపించి, చివరకు అతని నుంచి ఏకంగా రూ.2.9 కోట్లను కాజేశారు. ఈ ఘటన నగరంలోని శేరిలింగంపల్లి ప్రాంతంలో వెలుగుచూసింది.
బాధితుడు సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. గతేడాది నవంబర్ 12న అతని వాట్సాప్కు వచ్చిన ఓ లింక్ ద్వారా స్టాక్ మార్కెట్ పెట్టుబడుల సలహాలు ఇస్తామని చెప్పే ఓ గ్రూప్లో చేరాడు. ఆ గ్రూప్లో తనను అనిల్ గోయల్గా పరిచయం చేసుకున్న వ్యక్తి, ప్రత్యేక మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించాడు.
మొదట నమ్మకం కలిగించేలా రూ.5 వేల పెట్టుబడితో ప్రారంభించి, కొద్దికాలంలోనే లాభాలు వచ్చినట్లు యాప్లో చూపించారు. ఆ తర్వాత 300 శాతం లాభాలు వస్తాయంటూ మాటలతో మభ్యపెట్టి, దశలవారీగా ఎక్కువ మొత్తాలు పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహించారు. ఈ క్రమంలో బాధితుడు మొత్తం రూ.2.9 కోట్లు వివిధ బ్యాంకు ఖాతాల ద్వారా బదిలీ చేశాడు.
యాప్లో తన ఖాతాలో రూ.3.47 కోట్లు ఉన్నట్లు కనిపించడంతో డబ్బు విత్డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా, వివిధ కారణాలు చెప్పి నిరాకరించారు. అదనపు చార్జీలు, ట్యాక్స్లు చెల్లించాలని కోరడంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియా లింకులు, అపరిచిత యాప్ల ద్వారా వచ్చే పెట్టుబడి ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అధిక లాభాల ఆశకు లోనుకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.
