మన భారత్ , ముంబాయి: నవి ముంబై పణ్వేల్లో ఈనెల 18వ తేదీ ఆదివారం జరగనున్న ప్రతిష్టాత్మక సాహిత్య సమ్మేళనానికి ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ సాహితీవేత్తలు మధు బావల్కర్, అఖిల భారతీయ మాలి మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు, సీనియర్ హిందీ ఉపాధ్యాయులు సుకుమార్ పెట్కులేలకు అధికారిక ఆహ్వానం అందింది. ఈ ఆహ్వానాన్ని కొంకన్ మరాఠీ సాహిత్య పరిషత్ పణ్వేల్ (ముంబై) మరియు పంచశీల తరుణ్ మండల్ సావర్గం సంస్థలు సంయుక్తంగా పంపినట్లు తెలిపారు.
ఈ సాహితీ సమ్మేళనంలో పాల్గొనడానికి శనివారం మధ్యాహ్నం నందిగ్రామ్ ఎక్స్ప్రెస్లో ముంబైకి బయలుదేరి వెళ్లనున్నట్లు సుకుమార్ పెట్కులే వెల్లడించారు. తెలంగాణలో బహుజన సాహిత్యాన్ని కేంద్రంగా చేసుకొని హిందీ, మరాఠీ, తెలుగు భాషల్లో కవితలు, అనువాద రచనలు చేస్తూ విశేష గుర్తింపు పొందిన సుకుమార్ పెట్కులేను, బహుభాషా కవిగా పేరుగాంచిన మధు బావల్కర్ను ఈ కార్యక్రమంలో ఘనంగా సన్మానించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమ నిర్వాహకులు, ప్రముఖ సాహితీవేత్త నాగనాథ్ డోలారే (పణ్వేల్, ముంబై) మాట్లాడుతూ, ఈ సందర్భంగా తన రచనలైన మరాఠీ భాషలోని రెండు కవితా సంపుటి పుస్తకాలను ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. అనంతరం కవి సమ్మేళనం నిర్వహించనుండగా, ఇందులో మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి పలువురు కవులు, సాహితీవేత్తలు పాల్గొననున్నారు.
ఈ సాహితీ సమ్మేళనం భాషా సాహిత్యాల మధ్య సాంస్కృతిక అనుబంధాన్ని మరింత బలపరచే వేదికగా నిలవనుందని సాహిత్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
