చేవెళ్ల బస్సు ప్రమాదంలో కన్నీరు పెట్టిన తండ్రి
మన భారత్, రంగారెడ్డి,చేవెళ్ల, నవంబర్ 6: ఇటీవలి చేవెళ్ల బస్సు ప్రమాదం మూడు కుటుంబాలను శోకసముద్రంలో ముంచింది. ఆ ప్రమాదంలో ముగ్గురు కూతుళ్లను కోల్పోయిన తండ్రి ఎల్లయ్య గౌడ్ నష్ట పరిహారం చెక్కు అందుకుంటూ హృదయాన్ని కదిలించేలా మాటలు చెప్పాడు. “నా ముగ్గురు కూతుళ్లు ఒక్కొక్కరు ఉద్యోగం చేసుకుంటూ నెలకు కొంత మొత్తాన్ని నాకు పంపేవారు. ఇప్పుడు వాళ్లందరికీ ప్రభుత్వం ఇచ్చిన ఈ రూ.21 లక్షల చెక్కు చూస్తుంటే, ఇది వాళ్లు నాకు పంపిన చివరి జీతమా?” అంటూ ఎల్లయ్య గౌడ్ కన్నీరు పెట్టుకున్నాడు.
చేవెళ్ల మండల పరిధిలో జరిగిన ఆ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువతులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం ప్రకటించింది. ప్రతి బాధితురాలి కుటుంబానికి రూ.7 లక్షల చొప్పున మొత్తం రూ.21 లక్షల చెక్కును అధికారులు ఎల్లయ్య గౌడ్కు అందజేశారు. చెక్కు అందుకున్న క్షణంలో ఆయన కంటతడి ఆపుకోలేకపోయాడు.
గ్రామ ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ ఈ దృశ్యాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నారు. “నా కూతుళ్లు ఒక్కొక్కరు నా బలం, నా గర్వం. వాళ్లను కోల్పోయిన నొప్పి డబ్బుతో నిండదు” అంటూ ఎల్లయ్య గౌడ్ విలపించాడు.
ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను కలచివేసింది. సామాజిక మాధ్యమాల్లో కూడా ఎల్లయ్య గౌడ్ మాటలు వైరల్ అవుతున్నాయి. బాధిత కుటుంబానికి సానుభూతి తెలుపుతూ అనేకమంది దుఃఖం వ్యక్తం చేస్తున్నారు.
