మన భారత్, ఆదిలాబాద్ :
ఆదిలాబాద్ జిల్లాలో దళితుల అభ్యున్నతికి విశేష సేవలు అందిస్తున్న అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు భీంరావ్ వాగ్మారేకు లభించిన “దళిత రత్న” బిరుదుపై జిల్లా కలెక్టర్ రాజర్షి షా అభినందనలు తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో భీంరావ్ వాగ్మారేను కలెక్టర్ ప్రత్యేకంగా సత్కరించారు.
ఇటీవల ఏప్రిల్ 14న హైదరాబాద్లోని రవీంద్ర భారతి వేదికగా నిర్వహించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా భీంరావ్ వాగ్మారేకు “దళిత రత్న” పురస్కారం ప్రదానం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో దళితుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, సామాజిక సేవలలో ఆయన చేస్తున్న కృషిని గుర్తించి ఈ బిరుదు అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజార్శిష్ మాట్లాడుతూ, సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి భీంరావ్ వాగ్మారే చేస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు. ఇలాగే మరింత ఉత్సాహంతో సేవలు కొనసాగిస్తూ జిల్లాలోని దళితుల సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
భీంరావ్ వాగ్మారే మాట్లాడుతూ, తనకు లభించిన ఈ గౌరవం మరింత బాధ్యతను పెంచిందని, దళితుల అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాదాసాహెబ్ జాబడే, తెలంగాణ మాదిగ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నక్క రాందాస్ తదితరులు పాల్గొన్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
