స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు టెట్ మినహాయింపు లభ్యం కాదు — హైకోర్టు స్పష్టం
మన భారత్, హైదరాబాద్ : భవితా కేంద్రాల్లో పనిచేస్తున్న స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు టెట్ (Teacher Eligibility Test) అర్హత తప్పనిసరి అని హైకోర్టు తేల్చిచెప్పింది. టెట్ అర్హత నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ టీచర్లు దాఖలు చేసిన మూడు పిటిషన్లను శుక్రవారం నాడు హైకోర్టు కొట్టి వేసింది.
సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) మరియు స్కూల్ అసిస్టెంట్ కేడర్లలోని ప్రత్యేక విద్యా ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలంటూ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ లతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది.
పిటిషనర్ల తరఫున న్యాయవాదులు వాదిస్తూ, కేంద్ర పునరావాస మండలి (RCI) నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వం టెట్ అర్హతను తప్పనిసరి చేస్తూ జారీ చేసిన జీఓ రాజ్యాంగ విరుద్ధమని వాదించారు. అయితే, ప్రభుత్వ న్యాయవాది వాదనలో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) మార్గదర్శకాల ప్రకారం ప్రత్యేక టీచర్లకు కూడా టెట్ తప్పనిసరని స్పష్టం చేశారు.
ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం ధర్మాసనం ప్రభుత్వం వైఖరిని సమర్థిస్తూ, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు టెట్ మినహాయింపు వర్తించదని తీర్పు వెలువరించింది. దీంతో, రాష్ట్రంలోని ప్రత్యేక విద్యా ఉపాధ్యాయులందరికీ టెట్ అర్హతను పూర్తి చేయడం తప్పనిసరి అవుతోంది.
ఈ తీర్పుతో, భవిష్యత్తులో భవితా కేంద్రాలు, ప్రత్యేక పాఠశాలల్లో నియామకాలు జరగబోయే ఉపాధ్యాయులందరికీ టెట్ సర్టిఫికెట్ ఉండటం తప్పనిసరి కానుంది.
